calender_icon.png 23 October, 2024 | 5:51 PM

అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజలు వ్యతిరేకం

23-10-2024 03:58:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. అదానీ ఆధ్వర్యంలో రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలని చూస్తున్నారు.

కానీ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తే కకావికలం అవుతుందని మూగజీవాలకు గడ్డి దొరకదని  జగదీష్ రెడ్డి వెల్లడించారు. అవసరం అయితే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే అడ్డం పడ్డ కోదండరాం ఎందుకు మాట్లాడటం లేదు, మూసీపై ఎందుకు మాట్లాడటం లేదు, హరగోపాల్ ఎందుకు ప్రభుత్వ నిర్ణయాలపై తన గొంతు విప్పడం లేదని ప్రశ్నించారు. పదవుల కోసమే మేధావులు తమ గొంతును విప్పడం లేదా..? అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

దామగుండం, రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీతో మూసీ నది కాలుష్యం అవుతుందని ధ్వజమెత్తారు. నల్గొండకు మూసీ ద్వారా త్రాగునీరు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రెడ్డి రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా కడతారన్నారు. ప్రధాని మోదీకి బీ టీమ్ గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో మోదీ,రేవంత్ మిలాఖత్ స్పష్టం అవుతోందని దుయ్యబట్టారు. వాల్మీకి స్కామ్ లో కర్ణాటక నేతలపై చర్యలు తీసుకున్న ఈడీ తెలంగాణలో ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకుండా చివరి వరకు అడ్డుకుంటామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.