17-04-2025 04:32:08 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని కట్టు మల్లారం గ్రామంలో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు గదులను గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం కొరకు వందల కోట్లు నిధులు సమకూర్చిందని విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది విద్య మాత్రమే అని తెలియజేశారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలకి దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటి గ్రామంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మణుగూరు ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ నాగజ్యోతి, ఐటీడీఏ డీఈ మధుకర్, ఎఇ ప్రసాద్ రావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు ప్రభుత్వ అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు తదితరులు పాల్గొన్నారు.