మహిళలను రేవంత్ మోసం చేశారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. 15 వేలు రైతుబంధు అన్నారు.. గుండుసున్నా చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కిట్ కంటే మంచిది ఇస్తామని పేద గర్భిణీలను మోసం చేశారు. ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలను అక్టోబరు వచ్చినా వేయలేదని ఆరోపించారు. చేపపిల్లల కోసం బడ్జెట్ లో కేవలం రూ. 16 వేల కోట్లే కేటాయించారని విమర్శించారు. ముఖ్యనేతల కోసం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్ మెంట్ మార్చారని హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి.. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తానంటోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తే ప్రజలపై రూ. 20 వేల కోట్ల భారం పడుతోందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 158 కిలో మీటర్ల మేర కేంద్రమే నిర్మిస్తోందన్నారు. ఉత్తర భాగం నిర్మాణం కోసం భూసేకరణ ఇంకా ప్రారంభం కాలేదని హరీశ్ రావు వెల్లడించారు.