calender_icon.png 28 October, 2024 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్లపై ప్రత్యేక నిఘా ఉంచండి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

28-10-2024 04:55:27 PM

జడ్చర్ల నియోజకవర్గానికి అదనపు సిబ్బంది అవసరం

డీజీపీని కలిసి కోరిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల, విజయక్రాంతి: జడ్చర్ల పట్టణంలో పెరుగుతున్న జనాభా అవసరాలు, లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక నిఘా అవసరం తో అవసరమైన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సోమవారం రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ ను కలిసి కోరారు. జడ్చర్ల పట్టణంలో ప్రస్తుతం స్థానిక స్థానికేతరుల జనాభా 1.25 లక్షల దాకా ఉండగా ప్రతిరోజూ 30 వేల మంది పట్టణానికి రాక పోకలు సాగిస్తున్నారని అనిరుధ్ రెడ్డి చెప్పారు. జడ్చర్ల మండలం జనాభా కూడా లక్ష దాటిందన్నారు. జడ్చర్ల 44 వ నంబర్ జాతీయ రహదారి, 167 వ నంబర్ జాతీయ రహదారుల కూడలిగా ఉందని గుర్తు చేశారు.

లాగే రైల్వే ద్వారా పెద్ద సంఖ్యలో ఎగుమతి, దిగుమతులు కూడా జరుగుతున్న కారణంగా వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే జడ్చర్ల లో ఇప్పుడున్న ఒక్క పోలీస్ స్టేషన్ పై పని  భారం పెరుగుతోందని, దీనివల్ల సమస్యలు పరిష్కరించడం లో ఇబ్బందులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల పట్టణంలో అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి, వాహనాల రాకపోకలను నియంత్రించడానికి, ప్రజలకు మరింత మెరుగైన రక్షణ కల్పించడానికి అదనపు పోలీస్ సిబ్బంది కావాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. కాగా ఈ విషయం గురించి సానుకూలంగా స్పందించిన డీజీపీ జితేందర్ ఈ విషయంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.