15-04-2025 10:30:46 PM
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు...
పాల్గొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్..
మహాదేవపూర్ (విజయక్రాంతి): 2025 మే 15 నుండి 26 వరకు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరగనున్న 'సరస్వతీ పుష్కరాలు' కోసం, అందుకు సంబంధించిన ఏర్పాట్లు వివరాలు భక్తులకి సమగ్రంగా తెలిపేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్(Minister Sridhar Babu) బాబు మంగళవారం హైదరాబాదులోని డా.బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో ప్రారంభించారు. పుష్కరాలకి వచ్చే భక్తులు, యాత్రికులకు సౌకర్యాలు వివరాలు తెలిపేందుకు వీటిని ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక పరిషత్ అడ్వైజర్ గోవింద హరి, ఆలయ ఈవో మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
'సరస్వతీ పుష్కరాలు' పండుగకు 35 కోట్ల వ్యయంతో స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విసృతంగా చేపట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ ప్రభుత్వ హయంలో గతంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించామని, ఇప్పుడు కూడా ఆ అవకాశం మాకు రావడం ఆ భగవంతుడి ఆశీస్సులున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దేవాలయాల విషయంలో చాలా క్రీయాశీలకంగా పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వం దేవాదాయ శాఖ సంబంధిత వ్యవహారాలను పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. తాను దేవాదాయ శాఖ మంత్రి అయ్యాక పలు అంశాలను, ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు తెలిపారు.
సమ్మక్క సారక్క జాతర, కొమురవెల్లి కళ్యాణం, భద్రాచలం కళ్యాణం తదితర అన్నీ కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినట్టు వివరించారు. యాదగిరి టెంపుల్ కు పాలక మండలికి చట్ట సవరణ చేపట్టినట్టు చెప్పారు. అయితే, ఈ సరస్వతీ పుష్కరాలకు రోజుకు 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు వివరించారు. 17 అడుగుల రాతి సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చలువ పందిళ్ళ, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వెబ్ సైట్, యాప్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు వివరాలు ఉంటాయని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తదుపరి మహిళలకు ఉచిత బస్ పథకం ద్వారా మహిళలు దేవాదాయాలు దర్శించుకుంటున్నారని తద్వారా ఈ శాఖకు ఆదాయం సమకూరుతున్నట్లు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున దేవాలయాలకు వస్తున్నారని అన్నారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని, పవిత్ర సరస్వతీ పుష్కరస్థానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోవునని భక్తుల ప్రగాడ విశ్వాసమని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహించుచున్నందున కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమ తీరంలో గతంలో తేది 30.05.2013 నుండి 10.06.2013 వరకు సరస్వతి పుష్కరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
వచ్చే నెల 15వ తేది నుండి 26 వరకు “12” రోజులు సరస్వతి నది పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేయనున్నారని, పుష్కర ప్రారంభం మే 15 రోజున శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుండి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభిస్తారని అన్నారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాదిపతి శ్రీ శ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి గారు మే18, పుష్పగిరి పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు, మే 19న నాసిక్ త్రయంబకేశ్వర్ శ్రీ శ్రీ శ్రీ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్ గారు, మే 23 న హంపి విరుపాక్ష పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి గారు పుష్కర స్నానం ఆచరిస్తారు.
సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సుమారు 50 వేల నుడి లక్ష వరకు భక్తులు వచ్చి పుష్కర స్నానం చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుంటారని అంచనా వేసి తెలంగాణ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినది.పుష్కరాల నిధులతో ప్రస్తుతం ఉన్న ఘాట్ యొక్క వెడెల్పు పెంచుతూ అధునాతనంగా అన్ని సౌకర్యాలతో నూతన ఘాట్ నిర్మాణం చేసి దానిని సరస్వతి ఘాట్ గా నామకరణం చేయుటకు ఏర్పాట్లు జరుగుచున్నవి. సరస్వతి పుష్కర ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అలాగే రెండు ఘాట్ల వద్ద స్వాగత తోరణంల నిర్మాణం కూడా జరుగుతుంది.పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కొరకు దేవస్థానం వద్ద 100 రూముల వసతి గృహం, డార్మేటరి భవనం, నూతనముగా అందుబాటులోనికి తీసుకొనిరావడం జరిగింది. అంతేకాకుండా ఘాట్ వద్ద 100 గదులతో కూడిన టెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తుల స్నానాల కొరకు షవర్లు ఏర్పాటు, దుస్తులు మార్చుకొనే గదులు, వేసవి కావడముతో దేవాలయం చుట్టూ, ఘాట్ల వద్ద చలువ పందిర్లు, మినరల్ వాటర్ ట్యాంకులు నిర్మించి త్రాగు నీటి ఏర్పాటు, దేవాలయం చుట్టూ సి.సి. రోడ్ల నిర్మాణం, పిండ ప్రధాన మండపం, శాశ్వత మారుగుదొడ్లు, స్నానం గదుల నిర్మాణం తదితర పనులు చేపట్టడం జరిగింది.
పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కొరకు రాష్ట్రములోని వివిధ ప్రాంతాల నుండి. కాళేశ్వరమునకు ఆర్..టి.సి యాజమాన్యం ప్రతేక బస్సులు నడుపుటకు నిర్ణయించినది. కాళేశ్వరములో వివిధ ప్రాంతల వద్ద పార్కింగ్ స్థలాలను గుర్తించి చలువ పందిర్లు, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుచున్నది. శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద భక్తులకు సరిపోను విధముగా లడ్డు, పులిహోర ప్రసాదములను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులకు అన్నదానం, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధముగా త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు సరస్వతి ఘాట్ వద్ద కాశీ నుండి వచ్చే పురోహితులచే ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహిచడం జరుగుతుందిదేవాలయము వద్ద పుష్కరాలు జరిగే 12 రోజులు ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ఏర్పాట్లు చేయడం జరిగింది.
పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వద్ద, పుష్కర ఘాట్ ల వద్ద బస్టాండ్, పార్కింగ్ స్థలాల వద్ద డాక్టర్లు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధముగా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుష్కరాల పనులు అన్నీ ప్రారంభమై చురుగ్గా జరుగుచున్నాయి. జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జిల్లా యంత్రాగం మొత్తం పుష్కర ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారు.