భవిష్యత్ కోసమే హైడ్రా కూల్చివేతలు: సీతక్క
హైదరాబాద్: మౌలిక సౌకర్యాల నిర్మాణాలకు అటవీచట్టాలతో ఆటంకం కలుగుతోందని మంత్రి సీతక్క అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగిన (పెసా) జాతీయ సదస్సులో సీతక్క పాల్గొన్నారు. ఈ సదస్సుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... తెలంగాణలో సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గ్రామసభల తీర్మానమే ఉన్నతమైందని పెసా యాక్ట్ చెబుతోందన్న ఆమె పెసా యాక్ట్ ఉన్న గ్రామాల్లో తీర్మానాలతో అనుమతులు తీసుకోవచ్చని చెప్పారు. కేంద్ర నిధులు కూడా ఏళ్లుగా మురిగిపోతున్నాయి.. కేంద్ర నిధుల వినియోగానికి అటవీ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదని సీతక్క ఆరోపించారు. అనుమతులు లభించేలా అటవీ అధికారులకు సూచన చేయాలన్నారు. గ్రామాల అవసరాలకు అనుమతులు వచ్చేాలా చూడాలని కోరామని మంత్రి వెల్లడించారు. అటవీ గ్రామల అభివృద్ధికి గ్రామసభలకు అధికారం ఇవ్వాలని తెలిపారు.
హైడ్రాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చామని మంత్రి సీతక్క వెల్లడించారు. వరద ప్రాంతాల వద్ద ఇలాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్ వస్తోందన్నారు. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి డిమాండ్లు వస్తున్నాయని సీతక్క స్పష్టం చేశారు. కబ్జాదారులు పేదలను ముందుపెట్టి ఆక్రమణలు కాపాడుకునే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేందుకే హైడ్రా కూల్చివేతలని ఆమె పేర్కొన్నారు. కూల్చివేతలతో నిజమైన పేదలకు నష్టం కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. పేదలకు సానుకూల నిర్ణయం దిశగా ప్రయత్నం చేస్తామన్నారు.