కరీంనగర్: చిగురు మామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇందుర్తి బస్ స్టాప్ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు బైక్ పై మంత్రి పొన్నం ర్యాలీగా వెళ్ళారు. స్వచ్చధనం - పచ్చదనం లో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఇందుర్తి రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... ప్రభుత్వం ఇప్పటికే రైతులకు లక్ష రూపాయలు , లక్ష 50 వేల వరకు రుణమాఫీ పూర్తి చేసామన్నారు. ఆగస్టు 15 నుండి 2 లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుందన్నారు. రుణమాఫీ రాని వారు వ్యవసాయ అధికారులకు వివరాలు ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్ లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ రాని వారు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆఫీస్ లో లో వివరాలు ఇవ్వాలని తెలిపారు. రైతులు సంప్రదాయంగా పండే వరి, మొక్కజొన్న, పత్తి కాకుండా రెట్టింపు ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పాడి పరిశ్రమ, పశు సంపద పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై మీకు అవసరమైన అప్లికేషన్లు, లోన్లపై తన కార్యాలయంలో ఉన్న వారు సహకరిస్తారని తెలిపారు.
మహిళలకు స్త్రీ శక్తి పథకాలను ఉపయోగించుకొని మహిళా సాధికారత ఆర్థిక వృద్ధి సాధించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీలో పంట పొలాల చదును, రోడ్లు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతోందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగంలో రైతులు ఆర్థిక అభివృద్ధి చెందడానికి వేయాల్సిన పంటలు, పాడి పశు పోషణ తదితర అంశాల రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్ ,ఆర్డీవో మహేష్ , మండల స్పెషల్ ఆఫీసర్,ఎమ్మార్వో ఇతర వివిధ విభాగాల మండల అధికారులు, ఇంధుర్తి రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.