calender_icon.png 6 October, 2024 | 10:02 AM

ఎవరూ అధైర్య పడొద్దు: మంత్రి పొంగులేటి

04-09-2024 01:21:00 PM

ఖమ్మం, (విజయక్రాంతి): ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని, ఎవ్వరూ అధైర్యపడొద్దని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల, రామన్నపేట దానవాయిగూడెం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. రహదారుల మరమ్మత్తులు, తక్షణ సహాయం, బాధితుల వివరాల సేకరణ పై అధికారులకు తగు సూచనలు చేశారు. నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందిస్తామన్నారు.

అధికారులు సర్వే ప్రక్రియ వెంటనే చేపట్టి, పూర్తి చేయాలన్నారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి తగు న్యాయం చేస్తామన్నారు. తడిసిన బియ్యం స్థానే సన్న బియ్యం అందిస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో జి. గణేష్, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, మునిసిపల్ డిఇ ధరణి, అధికారులు, తదితరులు ఉన్నారు.