16-03-2025 05:00:37 PM
5కే రన్ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు..
కూకట్ పల్లి (విజయక్రాంతి): నిత్య వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ లోని తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5కే రన్ కార్యక్రమాన్ని ఆదివారం టూరిజం శాఖ(Tourism Department) చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... మన జీవితంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యమే ప్రథమం అని అందుకే ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు.
రోజు గంట వ్యవధి వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని, ఆరోగ్య ప్రాధాన్యతను ప్రజల్లో పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాంటి సంస్థలకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రన్ లో పెద్ద ఎత్తున యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్(Bandi Ramesh), శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.