calender_icon.png 19 September, 2024 | 7:11 AM

మీ ఫామ్‌హౌస్‌లలో జిల్లేళ్లు మొలిపిస్త

17-09-2024 01:41:55 AM

  1. అధికారం పోయినా మీకు మదం తగ్గలేదు
  2. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించేది ఎవడ్రా? 
  3. దమ్ముంటే టైమ్ చెప్పి రండి
  4. సొంత విగ్రహం కోసం ఈ స్థలం కేసీఆర్ రిజర్వ్ 
  5. పదవుల త్యాగం ఈ గాడిదలకు ఏం తెలుసు? 
  6. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? 
  7. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం
  8. రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ‘దొరల గడీలల్లో గడ్డి మొలవా లని తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నినదించిన విధంగానే.. వందల ఎకరాల్లో కట్టుకున్న మీ  ఫామ్‌హౌస్‌లలో జిల్లేళ్లు మొలిపిస్తా’ అని బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నాయకులకు అధికారం పోయినా మదం తగ్గలేదని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట పెట్టడానికి అర్హత లేదా? అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ నినాదాన్ని రాజకీయాల కోసం వాడుకున్న కొందరు సన్నాసులు రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా రని దుయ్యబట్టారు.

సచివాలయం ఎదుటు ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ‘ట్విట్టర్ పిట్ట కేటీఆర్ .. దేశంలోకి కంప్యూటర్ తెచ్చిందే రాజీవ్‌గాంధీ. నువ్వు ఐటీ శాఖ మంత్రివి కావడానికి రాజీవ్‌కారణం. లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడివి. లేదంటే రైల్వేస్టేషన్‌లో లేదా సిద్దిపేటలో చాయ్, సమోసా అమ్ముకునేటోడివి. ప్రాణ త్యాగం, పదవీ త్యాగం అంటే గాంధీ కుటుంబానిది మాత్రమే. మీది కుటుంబ పాలన. మీ అయ్య సీఎం, కొడుకు మంత్రి, అల్లుడు ఇరిగేషన్ మంత్రి. బిడ్డ ఎంపీ, ఒకరు రాజ్యసభ పదవులు తీసుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి వేల ఎకరాల్లో ఫామ్‌హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్న మీకు.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి సమయం దొరకలేదా?’ అని ఫైర్ అయ్యారు.

ఏపీలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా తెలంగాణ అమరుల త్యాగాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని గౌరవించాల్సిందిపోయి.. ఈ గాడిదలే ఇప్పుడు రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని అంటున్నారని  సీఎం మండిపడ్డారు. తెలంగాణ కోసం 11 వందల మంది యువకులు చనిపోతుంటే ఒకాయన చావునోట్లో తలపెట్టి వచ్చిండని చెప్తడు. ఇంకొకాయనకు పె ట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టే దొరకలేదని చెప్త డు. మరొకాయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతన్నాడు అని విమర్శించారు. 

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం

సచివాలయంలో దేశం అబ్బురపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని సీఎం తెలిపారు. ‘బుద్ధుని పక్కన బుద్ది లేని వాని విగ్రహం పెట్టాలని ఈ స్థలాన్ని రిజర్వు చేసి పెట్టిర్రు. ఆ గాడిదలకు బుద్ధిలేదు. రాజీవ్ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొల గిస్తామని అంటున్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి. దమ్ముంటే ఎవడు వస్తాడో రండి.. టైమ్ చెప్పండి నేనూ చూస్తా. రాజీవ్‌గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేశం అబ్బురపడే విధంగా సచివాలయం ఆవరణలో డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తాం. టీఆర్‌ఎస్ పార్టీకి ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్‌బాపూజీకి విలువ ఇవ్వని సన్నాసి కేసీఆర్. ఆయన మరణిస్తే కనీసం ఆయన్ను చూడటానికి వెళ్లలేదు. నీవు, నీ కొడుకు తెగించి దోచుకున్నారు.

కాలకేయ ముఠా, మిడతల దండు నుంచి తెలంగణను కాపాడుకుందాం’ అని అన్నారు. మహిళా యూనివర్సిటికి చాకలి ఐలమ్మ, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బూపూజీ పేర్లు పెట్టామని గుర్తుచేశారు. ఈ చిల్లర, మల్లర గాళ్లు, కాలకేయ ముఠా, మిడతల దండును గ్రామాల్లోకి రానీయవద్దని, వచ్చినా పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 చోట్ల డిపాజిట్ కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిగ్గు విడిచి మాట్లా డుతున్నారని ఎద్దేవా చేశారు. సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్‌గాంధీనే..

దేశానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చి.. కంప్యూటర్ యుగాన్ని పరిచయం చేసింది మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీయేనని సీఎం అన్నారు. దేశం కోసం ప్రాణాలు, పదవి త్యా గం చేసిన కుటుంబంపై కొందరు సన్నాసు లు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఓటు హక్కు కనీస వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర నిధులు నేరుగా గ్రామాలకు వచ్చేలా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. మీరు మాత్రం మహిళకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు.

‘గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా ఒకేసారి పదవులు తీసుకోలేదు. నెహ్రూ తర్వాతనే ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని పదవి చేపట్టారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా.. రాజీవ్‌గాంధీ పైలట్‌గా ఉద్యోగం చేశారు. ఇందిరా చనిపోయాక.. రాజీవ్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. రాజీవ్‌గాంధీ ఉగ్రవాదులు చేతు ల్లో మరణించాక.. సోనియాగాంధీ కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావును ప్రధానిని చేశా రు. 2004 నుంచి 1014 వరకు మన్మోహన్‌సింగ్‌ను ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. అప్పుడు సోనియా, రాహుల్‌గాంధీ పదవులు తీసుకోలేదన్న విషయం ఈ గాడిద లకు ఏం తెలుసు’ అని దుయ్యబట్టారు.  

కేటీఆర్ మానసిక స్థితి బాగలేదు: మంత్రి కోమటిరెడ్డి 

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మానసిక స్థితి బాగలేనట్లుందని, ఆయన డాక్టర్లకు చూపించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావునోట్లో తలపెట్టారని అంటున్నారని, ఆయన దొంగ దీక్ష చేశారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ప్రజల్లోకి వచ్చి ఎన్నడూ ప్రజా సమస్యలు తెలుసుకోలేదని  అన్నారు. బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం రాదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్,  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.