calender_icon.png 24 October, 2024 | 11:59 PM

హస్తవ్యస్తం..!

12-08-2024 02:36:19 AM

  1. సిద్దిపేట ‘కాంగ్రెస్’కు దిక్కెవరు ?
  2. అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదు?
  3. పార్టీ నేతలపై కోవర్టుల ముద్ర ఉండడమే కారణమా?
  4. గ్రూప్ రాజకీయాలు, అంతర్గత పోరుకు ఫుల్‌స్టాప్ లేదా?

సిద్దిపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోట. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు నేతల హవా జిల్లాలో కొనసాగుతున్నదనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ అధిష్ఠానం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ అమలు చేయడం లేదు. దీంతో అధిష్ఠానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నేతలను అధిష్ఠానం నమ్మకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని జిల్లాలో రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గ్రూపు రాజకీయాలు, సీనియర్లు, జూనియర్ల మధ్య సఖ్యత కొరవ డడం, వలస నాయకుల ఆధిపత్యం.. ఇలా అనేక సమస్యలను కాంగ్రెస్‌పార్టీని వెంటాడుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే గ్రూప్ రాజకీయాలు నడుస్తుండడం పార్టీ నాయకులను అయోమయానికి గురిచేస్తున్నది.   

ఐక్యంగా పనిచేస్తే తప్ప..

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి గ్రూపు రాజకీయాలు, అంతర్గత పోరు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొ ప్పిగా మారిందని సొంత పార్టీ నాయకులే చర్చించుకుం టున్నారు. నర్సారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ అమలు చేయకపోవడం, పార్టీలో కొత్తగా చేరికలు లేకపోవడంతో పార్టీకి కలిసి రావడం లేదు. ఈ పరిణామాల రీత్యా పార్టీ అధిష్ఠానం కూడా  జిల్లాపై చిన్నచూపు చూస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ నుంచి ఎక్కువ మంది కోవర్టులు ఉంటారనే అపవాదు కూడా జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఉంది.

పార్టీ నేతుల, నాయ కులందరూ ఐక్యంగా పని చేస్తే పార్టీకి మేలు జరగదని, అందర్నీ ఒక తాటిపైకి తెచ్చేందుకు ఇప్పటికే కొందరు సీనియ ర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నామినేటెడ్, పార్టీ పదవుల విస్తరణ జరిగితే కానీ పార్టీకి బలంపెరగదనే విషయాన్ని ముఖ్యనేతలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

పోటాపోటీ.. 

సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవికి జిల్లాలో గట్టి పోటీ నెలకొన్నది. జిల్లా కేంద్రం చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ పదవిని దిక్కిం చుకునేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటు న్నారు. గతంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవులకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండింటి కన్నా సుడా చైర్మన్ పదవికి క్రేజ్ పెరిగింది.

సుడా చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఇప్పటికే కొందరు నేతలు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో సిద్దిపేట వ్య వసాయ మార్కెట్ కమిటీ ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు నంగునూరు, చిన్నకోడూర్ మండలాల్లోనూ ఏఎంసీలు వచ్చాయి. దీంతో సిద్దిపేట ఏఎంసీ చైర్మన్ పదవికి ప్రాధా న్యం తగ్గింది. అలాగే కొందరు ఆశావహులు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నా బాద్ నియోజకవర్గాల పరిధిలోని నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.

మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో..

వ్యవసాయశాఖకు అనుసంధానంగా పని చేసే కీలకమైన విభాగాల్లో ఆత్మ కమిటీ ఒకటి. గతంలో చాలా కీలకంగా పనిచేసిన కమిటీలు కాలక్రమేణా వాటి ఉనికిని కోల్పోయాయి. దీంతో ఆ కమిటీ చైర్మన్ పదవులను అడిగేవారే లేరు. నామినేటెడ్ పదవులపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. ఆశావహులంతా గట్టిగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహను ప్రసన్నం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే.. సదరు నేతలకు మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, ఒకవేళ కలిసి మాట్లాడే అవకాశం దొరికిరా పదవుల గురించి అడగొద్దని మంత్రులు ముక్కు సూటిగా చెబుతున్నట్లు తెలిసింది.