12-02-2025 01:26:23 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవా రం విడుదల చేసి న జేఈఈ మెయి న్స్ ఫలితాల్లో తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, ఏపీ నుంచి గుత్తికొండ సాయిమనోజ్ఞతో పాటు దేశ వ్యాప్తంగా మరో 12 మంది 100 పర్సంటైల్ సాధించారు.
జేఈఈ మెయిన్స్ సెషన్ పేపర్- 1 (బీఈ/ బీటెక్)కు దేశవ్యాప్తంగా 618 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాల్లో 12,58,136 మంది పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ పేపర్ -2 (బీఆర్క్/ బీ ప్లానింగ్) ఫలితాలను తర్వాత వెల్లడిస్తామని ఎన్టీఏ ప్రకటించింది.
స్కోర్ కార్డు డౌన్లోడ్ ఇలా..
అభ్యర్థులు స్కోరు కార్డు డౌన్లోడ్ చేసుకునేందుకు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దేశంలోని ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 22, 23, 24, 28, 29వ తేదీల్లో జేఈఈ మెయిన్స్ సెషన్ - 1 పరీక్ష జరిగింది. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్స్ సెషన్ -2 కు పరీక్షలు జరగనున్నాయి.
దరఖాస్తులకుఈ నెల 25 వరకు గడువు ఉంది. మొదటి విడతలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్ష రాస్తుంటారు. ఈ రెండింటిలో సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ర్యాంకుల కేటాయింపు ఉంటుంది.
తర్వాత రిజర్వేషన్లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ సాధిస్తారు.