14-03-2025 05:57:40 PM
మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు
చేగుంట,(విజయక్రాంతి): నిండు అసెంబ్లీలో దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానిస్తూ మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(BRS MLA Jagadeeshwar Reddy) శాసనసభ సభ్యత్వాన్ని ఏథిక్స్ కమిటీ ద్వారా వెంటనే రద్దు చేయాలని మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. శాసనసభ స్పీకర్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఉద్దేశ్యపూర్వకంగానే జగదీశ్వర్ రెడ్డి తన స్థాయిని మర్చిపోయి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితుడిని సీఏం చేస్తానని చేయలేదన్నారు. దళితులకు డబల్ బెడ్ రూమ్, దళిత బంధు, మూడు ఎకరాల భూమి అంటూ ఎన్నో ప్రలోభాలు పెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సస్పెండ్ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. దళితులను పథకాల పేరుతో నిండా ముంచిన బీఆర్ఎస్ కు ప్రజలే 2023 ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దళితుడిని అసెంబ్లీలో స్పీకర్ ను చేస్తే బీఆర్ఎస్ కు మింగుడుపడటం లేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో ప్రభుత్వం ప్రజల ఆదరణను పొందుతుంటే బీఆర్ఎస్ నాయకులు చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవలే రూ.6 వేల కోట్లతో పలు కార్పొరేషన్ల స్కీంలు ప్రకటించి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు అండగా నిలవడం బీఆర్ఎస్ కు నచ్చడం లేదన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన స్పీకర్ పట్ల సభ గౌరవ మర్యాదలు కాపాడకుండా అనుచితంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని బేషరత్ గా క్షమాపణలు చెప్పాలన్నారు. లేనిపక్షంలో ఆయన శాసన సభ సభ్యత్వం రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, మండల ఉపాధ్యక్షులు మసాయి పెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు