24-03-2025 05:07:34 PM
టేకులపల్లి (విజయక్రాంతి): ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ మాట్లాడుతూ... ఈ సంవత్సరం (2025) అంతానికి క్షయ వ్యాధిని భారతదేశం నుండి తరిమి కొట్టడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతోనే సాధ్యపడుతుందని అన్నారు. 15 రోజులకు మించి దగ్గు తగ్గనప్పుడు, తెమడ రక్తం పడటం జ్వరం ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేసే నాణ్యమైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
క్షయ వ్యాధి మందులతో పూర్తిగా తగ్గిపోతుందని వ్యాధి పూర్తిగా తగ్గిపోయేంత వరకు ప్రభుత్వమే అత్యంత ఖరీదైన మందులు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు మందులు వాడే కాలానికి పోషకాహార నిమిత్తం నెలకు ₹1000 రోగి బ్యాంకు ఖాతాలో వేయడం జరుగుతుందని ఇలాంటి సౌకర్యాలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండవని వ్యాధి లక్షణాలు ఉన్నవారు, గతంలో క్షయ వ్యాధికి మందులు వాడిన వారు, వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు వాడుతూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారందరూ కూడా క్రమం తప్పకుండా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని క్షయ వ్యాధి అంతానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని వైద్యాధికారి కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారిణి విజయశ్రీ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, టీబి నోడల్ ఆఫీసర్ నాగుబండి వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు కౌసల్య, సింగ్, గుజ్జా విజయ, ల్యాబ్ టెక్నీషియన్ రాజు, నాగలక్ష్మి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ధరణి, శైలజ, రుక్సానా, రజిత, విజయ, కిరణ్, కుమారి, సైదమ్మ, వెంకటరమణ, ధనసరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.