26-02-2025 01:50:19 AM
ఎస్ ఈ శ్రావణ్ కుమార్
కామారెడ్డి, ఫిబ్రవరి 25( విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ ఉత్తర విద్యుత్ సంస్థ ఎస్ ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విద్యుత్ అధికారులతో కలిసి కామారెడ్డి లోని 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్ పనులను పర్యవేక్షించారు. కామారెడ్డి -1 సబ్ స్టేషన్ కాకతీయ నగర్ కాలనీ సబ్ స్టేషన్ వరకు నిర్మాణంలో ఉన్న 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్ పనులను ఎస్ ఈ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఈ ఇంటర్ లింకింగ్ లైన్ పూర్తయిన తరువాత 33 కెవి చిన్న మల్లారెడ్డి ఫీడర్ పై ఉన్న ఓవర్లోడ్ సమస్య తగ్గి, హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్, నరసన్నపల్లి, చిన్న మల్లారెడ్డి, రాజంపేట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు మరింత స్థిరమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అదనంగా, కాకతీయ నగర్ కాలనీ సబ్ స్టేషన్ పరిధిలో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాటుకు వీలు కలుగుతుందన్నారు.
ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఎస్ ఈ శ్రవణ్ కుమార్ , సంబంధిత ఏఈ, కామారెడ్డి టౌన్ ఏఈ, కామారెడ్డి టౌన్-2 అధికారులను, పనులను ఒక్క వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.