calender_icon.png 2 October, 2024 | 7:56 AM

భవిష్యత్‌లో వరద సమస్య తలెత్తకుండా చర్యలు

10-09-2024 04:32:03 AM

  1. చెరువులు, కుంటల తూములు, కాల్వల ఆక్రమణలతోనే సమస్యలు 
  2. మంత్రి దామోదర రాజనర్సింహ 
  3. సంగారెడ్డిలోని పలు ప్రాంతాల్లో పర్యటన

సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): చెరువులు, కుంటల తూములు, కాల్వలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇళ్ల మధ్యలోకి చేరుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ, చంద్రయ్య కుంట, ఎర్రకుంట చెరువును పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచ నలు చేశారు. రెవెన్యూ కాలనీలో 130 ఇళ్లలోకి వరద నీరు చేరడంతో, భవిష్యత్‌లో వరద సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రయ్య కుంటకు ఓపెన్ డ్రైన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నా రు. నీటిపారుదల, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వరద నీటి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.

ఎర్రకుంట చెరువు, చంద్రయ్య కుంటలో వరద నీరు దిగువకు వెళ్లకుండా నిర్మాణాలు చేయడంతో సమస్య ఏర్పడినట్టు తెలిపారు. గతం లో ఉన్న చెరువులు, కుంటల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు బయటకు వెళ్లేందుకు కాల్వలు లేక నీరు నిల్వ ఉండి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. మంత్రి వెంట సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్‌డీవో రాజు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ యేసయ్య, ఈఈ భీంతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.