39 లక్షలతో మౌలిక వసతులు కల్పన
ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 88.8 శాతం ఉత్తీర్ణత
కొమురంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాత ఎస్పి కార్యాలయం, పాత డీఆర్డీఏ కార్యాలయంలో వసతి ఏర్పాటు చేసింది. మొదటి సంవత్సరం పూర్తి అవడంతో మరో వంద సీట్లు పెరగడం నేపథ్యంలో మహిళ విద్యార్థినిల కోసం మెడికల్ కళాశాలపై ఉన్న రెండు అంతస్తులలో వసతిని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మౌలిక వసతుల కల్పనకు 39 లక్షల రూపాయలు వెచ్చించనున్నట్లు ప్రిన్సిపాల్ పాలోజు సతీష్ కుమార్ తెలిపారు. మెడికల్ కళాశాల పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకముందే క్లాసులు ప్రారంభించడంతో మొదటి సంవత్సరం విద్యార్థులు సమస్యల నడుమ విద్యనభ్యసించారు.
కళాశాలకు తమ వసతి ఉంటున్న భవనాలకు దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం ఉండడంతో మహిళ విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. నేపద్యంలో కలెక్టర్కు అందిన ఫిర్యాదులు ,వినతుల తో కళాశాల వద్ద మహిళా అభ్యర్థుల కోసం వసతి ఏర్పాటు చేసేందుకు ముఖ్య ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్షం రోజుల్లో నూతనంగా ఎంబిబిఎస్సి సాధించిన విద్యార్థినిలు అడ్మిషన్లు తీసుకోనున్నారు. ప్రస్తుతం 55 మంది మహిళ విద్యార్థినిలు ఉండగా 44 మంది పురుషులు ఉన్నారు. సీట్ల కేటాయింపు తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న వసతి గృహాల ను పురుషులకు కేటాయించారు.
ఫస్ట్ ఇయర్ ఫలితాల విడుదల
ఎంబిబిఎస్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలను మెడికల్ బోర్డు గురువారం విడుదల చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో 99 మంది పరీక్షలు రాయగా అందులో ఇద్దరూ డిస్టెక్షన్ సాధించగా ఫస్ట్ క్లాస్ లో 25 మంది, సెకండ్ సెకండ్ క్లాస్ 61 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.