10-04-2025 01:49:00 AM
ట్రేడింగ్ కంపెనీ లో రూ.13 లక్షలు అపహరించిన దుండగుడు
మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ రోడ్డు లో ఉన్న మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. దొంగ చాకచక్యంగా ట్రేడింగ్ కంపెనీలోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్ పగలగొట్టి అందులో నుంచి 13 లక్షల 30 వేల రూపాయలను అపహరించారని ట్రేడర్ ప్రమోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోల్లను మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ నిర్వహిస్తుంది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించిన తర్వాత వారికి నగదు చెల్లింపుల కోసం నిలువ చేసిన డబ్బు చోరీకి గురైందని వ్యాపారి తెలిపారు.
మంగళవారం రాత్రి గాలి దుమారం రావడంతో తాము డబ్బు కాష్ కౌంటర్లోనే ఉంచి వెళ్లిపోయామని, అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజాము రెండు గంటల ప్రాంతంలో దొంగ ఇంటి వెనక ఉన్న షట్టర్ ద్వారా లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లు పగలగొట్టి అందులో నుండి 13 లక్షల 30 వేల రూపాయలను ఎత్తుకెళ్లాడన్నారు.
ఈ దొంగతనం సంఘటన పూర్తిగా ట్రేడింగ్ కంపెనీలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఘటనస్థలిని మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య, ఎస్త్స్ర మురళీధర్ రాజ్ సందర్శించారు. అనంతరం క్లూస్ టీం రప్పించి విచారణ నిర్వహిస్తున్నారు.