వాచ్మెన్లను కత్తులతో బెదిరించి 50 లక్షలతో పరారీ
కాటేదాన్ పారిశ్రామికవాడలో ఘటన
రాజేంద్రనగర్, జూలై 21: కాటేదాన్ పారిశ్రామిక వాడలోని కంపెనీపై దొంగలు పంజా విసిరారు. బ్యాటరీలు తయారు చేసే ఓ కంపెనీలోకి చొరబడి వాచ్మెన్లను బెదిరించి రూ.50 లక్షలు దోచుకెళ్లారు. ఏసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం, కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ బ్యాటరీ కంపెనీలోకి ఆదివారం ఉదయం 3 గంటలకు ఐదుగురు దుండగులు చొరబడ్డారు. గేట్ వద్ద ఉన్న ముగ్గురు వాచ్మెన్లను కత్తులు, మారణాయుధాలతో బెదిరించి లోపలికి వెళ్లారు.
వాచ్మెన్లు బయటకు రాకుండా వారిని ఓ గదిలో పెట్టి తాళం వేశారు. చోరీ విషయం చెబితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బీరువా లో దాచి ఉంచిన 50 లక్షలు, వాచ్మెన్ల వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు తీసుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు, ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాచ్మెన్లతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.