టపాసుల దుకాణంలో చేలరేగిన మంటలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : అబిడ్స్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బొగ్గులకుంట ప్రాంతంలోని దేవాదాయ శాఖ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ‘పారా ఫైర్ వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంట లు పక్కనున్న హోటల్కు కూడా వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే మంటలు అంటుకొని పదికి పైగా వాహనాలు దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు. మంటలు ఎలా చెలరేగాయో తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.