10-01-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, జనవరి 9: ఒకప్పుడు ప్రజలు తాగేందుకు, పంటలకు స్వచ్ఛమైన సాగునీరందించిన చెరువులు నేడు మానవ తప్పిదాలతో కాలుష్య కేంద్రాలుగా మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మాసబ్ చెరువు క్రమంగా మురుగుకూపంగా మారుతోంది.
గతంలో రెండు కోట్ల రూపాయలతో సుందరీకరణ చేపట్టిన మాసబ్ చెరువుకు, కనీస నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రస్తుతం దాన్ని బాగోగులు చూసేవారు లేక అధ్వాన్న పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన కాలనీల నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు, వ్యర్థాలు చెరువులో చేరుతుండటంతో దుర్గంధభరిత హైదరాబాద్లో మరో మూసీనదిని తలపిస్తోంది.
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు యథేచ్ఛగా మురుగు నీటి వదులుతుండటంతో చెరువులోకి చేరి కలుషితమవుతున్నాయి. ఈ చెరువు కట్టపై ఉన్న పార్క్ పరిసర వాతావరణాన్ని చెరువు అందాలను వీక్షించేందుకు వస్తున్న సందర్శకులకు చెరువు నుంచి వస్తున్న ఆహ్లాదకర వాతావరణాన్ని దెబ్బతీస్తుంది.
ఈ సమస్యపై స్థానికులు ధికారులకు విన్నవించినా ఎలాం ప్రయోజనం లేదు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న మంచినీటి చెరువుల్లో తుర్కయంజాల్ మాసబ్ చెరువు ఒకటి. కాలుష్యం కారణంగా మంచినీటి చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చెరు పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆయా కాలనీల నుంచి..
మాసబ్ చెరువు ఎగువన ఉన్న ఓల్డ్ తుర్కయంజాల్, గుర్రంగూడ, నాదర్గుల్ గ్రామాలతో పాటు వివిధ కాలనీలు.. ఆదిత్యానగర్, వీకర్ సెక్షన్ కాలనీ, టీచర్స్ కాలనీ, రాజ్యలక్ష్మి, బృందావన్, పంచరాజు, శ్రీశ్రీ హోమ్స్, బాలాజీ హోమ్స్, సాయివంశీ హోమ్స్, జీపీఆర్, సావిత్రమ్మ, పోస్టర్, సరస్వతి, సాయిదుర్గ ఇలా చాలా కాలనీల నుంచి వచ్చే మురుగునీరు, వ్యర్థాలు విపరీతంగా వచ్చి మాసబ్ చెరువులో కలుస్తుండటంతో చెరువు నీరు పూర్తిగా కలుషితమవుతోంది.
త్వరలో ఎస్టీపీ ప్లాంట్
మాసబ్ చెరువులో మురుగు నీరు కలుస్తున్న విషయం విధితమే. దీనికోసం ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు మురుగునీటితో నిండిపోతుతున్న నేపథ్యంలో ఎస్టీపీ ప్లాంట్స్ చేయనుంది. దానిలో భాగంగానే 34 ఎమ్ఎల్డీ మంజూరైంది. ఇది త్వరలోనే తుర్కయంజాల్లో ప్రారంభమవుతుంది. దీంతో చెరువులోకి వివిధ కాలనీల్లోంచి వచ్చే మురుగునీరు శుద్ధి ప్రక్రియ చేపట్టి, చెరువు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటాం.
అమరేందర్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్
మురుగునీటి నుంచి కాపాడాలి..
చెరువు చుట్టూ బఫ జోన్, ఎఫ్టీఎల్ లను ఆక్రమించుకొని చేపట్టిన భవన నిర్మాణాలపై హైడ్రా అధికారులు దృష్టిసారించాలి. అదేవిధంగా ఈ నిర్మాణాల నుంచే కాకుండా చెరువు ఎగువన ఉన్న కాలనీల్లోని నివాసాలకు సంబంధించిన మురుగునీరు, వ్యర్థాలు చెరువులో కలవడంతో మురుగు నీటి కూపంగా మారుతుంది. కాబట్టి చెరువులో మురుగునీరు కలువకుండా కాపాడాలి.
జితేందర్, మన్నెగూడ