మొదటి దశలో 300 మందికి ఉద్యోగావకాశాలు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): అమెరికా కేంద్రంగా ఉన్న మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జీసీసీ) ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు.
ఆతిథ్య రంగానికి సంబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో మొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మ్యారియట్ ముందుకొచ్చిందని తెలిపారు. గురువారం మంత్రి శ్రీధర్బాబుతో కలిసి మ్యారియట్ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డికి వారి ఆసక్తిని వెల్లడించారు. మ్యారియట్ గ్లోబల్ ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు.
ఈ సామర్థ్య కేంద్రం వచ్చే ఏడాది మార్చిలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు. మొదటి దశలో 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని తెలిపారు. నగరంలో వివిధ టెక్ కంపెనీలకు చెందిన సామర్థ్య కేంద్రాలు 200 వరకు ఉన్నాయని, ఇవన్నీ సాంకేతిక సంస్థలని వివరించారు. మ్యారియట్ దేశంలోనే తొలిసారిగా ఆతిథ్య రంగానికి సంబంధించిన జీసీసీని ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా టెక్ యాక్సిలరేటరీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తితో ఉందని వెల్లడించారు. త్వరలో కార్యరూపం దాల్చనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలో మ్యారియట్ సంస్థ హోటళ్లను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు.
మీడియా సమావేశంలో మ్యారియట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రెవెన్యూ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ డ్రూ పింటో, గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నవీన్ మంగ, చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ జాన్ టూమీ, గ్రెగ్ మార్టెల్, అశిష్ కేలే, అలెగ్జాండర్ ప్యాన్, మంసూర్ బైగ్ పాల్గొన్నారు.
గ్రీన్ ఫార్మా సిటీలో కాలుష్యం ఉండదు
తాము ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీ పూర్తిగా పర్యావరణ రహితంగా ఉంటుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కొద్దిపాటు రసాయన కాలుష్య వ్యర్థాలు ఉత్పత్తి అయినా ఆయా కంపెనీలే సొంత ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసుకుంటాయని వెల్లడించారు. మరో పది రోజుల్లో ఎన్ని ఫార్మా కంపెనీలు వచ్చేది తెలుస్తుందని వివరించారు. ఫార్మా సిటీ అంటే కేవలం ఔషధ పరిశ్రమలే కాకుండా, గృహ వసతి కల్పించే సంస్థలు, హోటల్స్, వినోద రంగం, విద్యా సంస్థలు అన్ని ఉంటాయని వివరించారు.