calender_icon.png 6 October, 2024 | 1:40 AM

బైక్ పై నుంచి పడి వివాహిత మృతి

04-09-2024 02:59:43 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన మాసాడి సరోజ (45)అనే వివాహిత మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో బైక్ పై నుండి కింద పడి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందింది. సరోజ తన తనయుడు అజయ్ తో కలసి మోటర్ బైక్ పై బోయపల్లి గ్రామ శివారులో గల రైతు వేదిక సదస్సు దగ్గరకు వెళ్లి భూమికి సంబంధించిన జిరాక్స్ కాపీలను అందజేయడానికి  ఇంటి నుంచి బయలుదేరారు.ఈ క్రమంలో  మోటార్ సైకిల్ పై వెళ్తుండగా తన ఇంటికి అతి సమీపంలోని బోయపల్లి అండర్ బ్రిడ్జి  వద్ద ఒక బాలుడు అకస్మాత్తుగా ఎదురు వచ్చాడు.

దీంతో బైక్ నడుపుతున్న అజయ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో   తల్లి సరోజ  వాహనం పై నుండి కింద పడిపోయారు . గాయపడ్డ  సరోజ ను స్థానికులు గమనించి హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.మృతురాలి భర్త మాసా డి సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అమెరికాలో చదువుకుంటున్న కూతురికి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. గురువారం ఆమె బోయపల్లికి చేరుకున్నాక అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకు తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.