calender_icon.png 1 April, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సల్స్‌కు మరో ఎదురుదెబ్బ

30-03-2025 12:43:08 AM

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ

వీరిలో 11మంది మహిళలు, ఓ దళ కమాండర్ 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న పోలీసులు 

ఆయుధాలు మార్పు తేలేవన్న హోం మంత్రి అమిత్ షా

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 29 (విజయక్రాంతి)/చర్ల:  ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరో మారు దద్దరిల్లింది. సుక్మా, బీజాపూర్ జిలాల్లో భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో 1౮ మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 11 మంది మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల్లో హైర్యాంక్ కమాండర్ కూడా ఉండటం మావోయిస్టులకు పెద్ద దెబ్బే. రూ. 25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కమాండర్ జగదీశ్ అలియాస్ భద్ర ఈ కాల్పు ల్లో చనిపోయాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గా లు తెలిపాయి. ఈ దాడిలో ముగ్గురు డీఆర్‌జీ సిబ్బం దికి ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌కు కూడా గాయాలయ్యాయి.

2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టు దాడిలో జగదీశ్ కీలక నిందితుడు. ఆనాటి ఘటనలో ఛత్తీస్‌గఢ్ కాంగ్రె స్ అధ్యక్షుడితో పాటు 25 మంది చనిపోయా రు. శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ‘కాగా ర్’ పేరుతో మావోయిస్టులు ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు అందుకు టెక్నాలజీ సాయం కూడా తీసుకుంటున్నారు.

డిస్టిక్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ‘ఇప్పటి వరకు 17 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీ నం చేసుకు న్నాం. ముగ్గురు డీఆర్‌జీ సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉంది. వారికి ఎటువంటి ప్రాణా పాయం లేదు’ అని అధికారులు ప్రకటించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు  లభించాయి.

ఆయుధాల తయారీకి వాడే సామ గ్రి కూడా లభించినట్టు సమాచారం. ఏకే ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ మొద లైన ఆయుధాలు లభించాయి. చనిపోయిన మావోయిస్టుల గు ర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సంఘటనా స్థ లాన్ని సుక్మా జిల్లా ఎస్పీ పరిశీలించారు. మావోయిస్టు ఆపరేషన్ స్పెషలిస్ట్ డీఐజీ కమల్ లోచన్ సైనికులకు స్వీట్లు తినిపించి సత్కరించారు. మావోయిస్టులను నిర్మూలించే దిశగా దీనిని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు.

ఆయుధాలతో మార్పు అసాధ్యం: అమిత్ షా

వచ్చే ఏడాది మార్చి వరకు భారతదేశాన్ని నక్సల్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర మంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారు. ఆయన ప్రకటనకు తగ్గట్టుగానే భద్రతా బలగాలు మరో విజయం సాధించాయి. భద్రతా బలగాల విజయంపై అమిత్ షా స్పందించారు. ‘నక్సలిజంపై మరో దాడి. సుక్మా జిల్లా లో భద్రతా బలగాలు 17 మంది మావోయిస్టులను హతమార్చి పెద్ద సంఖ్యలో ఆయుధా లు స్వాధీనం చేసుకున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం. ఆయుధాలతో ఉన్న వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆయుధాలు, హింసతో మార్పు అసాధ్యం. శాంతి, అభివృద్ధితోనే మార్పును తేగలం’ అని అమిత్ షా పేర్కొన్నారు.

బీజాపూర్‌లో మరో మావోయిస్టు

బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మరణించాడు. బీజాపూర్ జిల్లాలోని నర్సాపూర్ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. మృతు డిని ఇంకా నిర్దారించలేదని బీజాపూర్ జిల్లా సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. 

సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది

మరణించిన మావోయిస్టులను గుర్తించే పనిలో ఉన్నాం. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన సైనికుల పరిస్థితి నిలకడగా ఉంది. వారికి మెరుగైన చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 

 -ఐజీ సుందరరాజ్