15-04-2025 07:24:17 PM
పాపన్నపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పాపన్నపేట గ్రామ శివారులోని సాలం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... మండల పరిధి నర్సింగరావుపల్లి తండాకు చెందిన లూనావత్ గోపాల్ (39) బిక్షాటన చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. రోజు మాదిరిగానే ఈనెల 12న ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు. పాపన్నపేట గ్రామ శివారులోని సాలం చెరువు వద్దకు స్నానం చేసేందుకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మంగళవారం సాలం చెరువు వైపు వెళ్లిన స్థానికులకు చెరువులు మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి గోపాల్ గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.