28-03-2025 12:00:00 AM
నల్లగొండ, మార్చి 27 (విజయక్రాంతి) : మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలివి.. మిర్యాలగూడలోని బంగారుగడ్డ ప్రాంతానికి చెందిన గంటోజు మధు (38) మద్యానికి బానిసయ్యాడు.
తాగేందుకు డబ్బులివ్వాలని నిత్యం తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి పేరు ఉన్న ఇంటిని తనకు రాసివ్వాలని రెండ్రోజులుగా ఇబ్బంది పెడుతుండడంతో గురువారం ఉదయం ఆమె టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది.
మద్యం మత్తులో తల్లిని అనుసరిస్తూ మధు సైతం స్టేషన్ వద్దకు రావడంతో పోలీసులు నచ్చజెప్పి పంపించారు. బయటకు వెళ్లగానే బాటిళ్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పుంటించుకోవడంతో శరీరం కాలిపోయింది.
పోలీసులు, స్థానికులు హుటాహుటిన హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నర్సయ్య తెలిపారు.