* డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఫూలే వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ర్ట అధ్యక్షుడు సుకుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి షిండే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంను కలిశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా.. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చారని, దీంతో అన్ని రంగాల్లో తాము వెనకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఫూలే జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించారన్నారు.
మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని, హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈసందర్భంగా మాలి కులస్తుల జాతీయ అధ్యక్షుడు విలాసరావు పాటిల్, సావిత్రి ఫూలే వంశీయులు డాక్టర్ దిలీప్ గణపతి డిప్యూటీ సీఎంను సన్మానించారు.