22-04-2025 04:12:50 PM
బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 132 - జీడిమెట్ల డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సమావేశమై ఈనెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షతపై స్వరాష్ట్ర సాధన ద్వారానే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అన్ని రంగాలలో అగ్రపథాన నిలిపిన మహోన్నత శక్తి, మన నాయకులు కేసీఆర్ ని అన్నారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతీ నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. రజతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో బయల్దేరి వెళ్ళి మన ఐకమత్యాన్ని, క్రమశిక్షణను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.