17-04-2025 04:09:29 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ఇంటి యజమానుల వివరాలు మున్సిపల్ రికార్డుల్లో తప్పుగా నమోదు అవుతున్నాయని వాటిని సరిచేసి ఇంటి యజమానుల ఇబ్బందులు తొలగించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(Republican Party of India) (ఏ) జిల్లా అధ్యక్షులు గుడికందుల తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం పట్టణ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజల ఆస్తిపన్ను చిట్టీలలో ఇంటి యజమానుల పేర్లు, ఇంటి పేర్లు తప్పులుగా నమోదు అవుతున్నాయని తద్వార ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన చిట్టీలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేవని, ఆన్ లైన్ చిట్టీలలో వివరాలు తప్పులుగా నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అదికారులు స్పందించి ఆన్ లైన్ ఆస్థి పన్ను చిట్టీలలో తప్పులు లేకుండా సరిచేయాలని కోరారు. అంతే కాకుండా పట్టణంలో నివాస మున్న సింగరేణి కార్మికులు వారి పదవీ విరమణ అనంతరం వారి ఆస్తులను అమ్ముకొని స్వగ్రామాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించి కొనుగోలు చేసిన వారి పేర్లను మున్సిపల్ రికార్డులో నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఐ(ఎ) జిల్లా ఇంఛార్జి పులిపాక శ్రీనివాస్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి రహమత్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గరిగే వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎండి యాకూబ్, నాయకులు బొంగోని మైసయ్య, తుమ్మ శంకర్ లు పాల్గొన్నారు.