- కలెక్టర్లకు బీసీ కమిషన్ ఆదేశాలు
- ఈనెల 28 నుంచి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణలు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కులగణనలో భాగంగా బహిరంగ విచారణ కోసం కమిషన్ చేపట్టనున్న జిల్లాల పర్యటనలకు సంబంధించి అన్నీ కలెక్టర్లకు బీసీ కమిషన్ సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్లతో వర్చవల్ సమావేశాన్ని నిర్వహించింది.
ఈనెల 28 నుంచి నవంబర్ 13 వరకు ఉమ్మడి జిల్లాల ప్రధాన కేంద్రాల్లో బహిరంగ విచారణలు నిర్వహించనున్నామని, ఈ క్రమంలో విచారణల గురించి విస్తృత ప్రచారం చేయడంతో పాటు, అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషన్ ఆదేశించింది. బహిరంగ విచారణ వేదికల లభ్యత, అనుకూలత గురించి కమిషన్ ఆరా తీసింది.
ఇంకా విచారణలను వ్యవస్థీకృత పద్ధతిలో నిర్వహించడానికి హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్ డెస్క్, సెక్రటేరియట్ డెస్క్ మొదలైన వివిధ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది. సమావేశంలో బీసీ కమిషన్ తరఫున చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, సభ్య కార్యదర్శి బాల మాయదేవి పాల్గొన్నారు.