calender_icon.png 23 September, 2024 | 5:01 AM

నా స్థాయికి పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు

15-09-2024 06:18:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించారు. దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని,  పీసీసీ అధ్యక్షుడిగా నా నియామకం కార్యకర్తలకు ఎంతో గుర్తుండిపోతుందన్నారు. బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నిరూపితమైందని నూతన పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ అని మహేష్ కుమర్ గౌడ్ వెల్లడించారు. నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటారని, కానీ సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏకమవుతారన్నారు.

అందరం ఏకతాటిమీదకు రావటం చూసినందునే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ లో 1985లో ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం ప్రారంభమైంది. గాంధీభవన్ తో 40 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన వెల్లడించారు. కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే.. అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవటం తెలంగాణ రాజకీయాల్లో గతంలో లేదన్నారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే... తెలంగాణ రాజకీయాల్లో భాష మారిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కు దీటుగా సమాధానం చెప్పేందుకే రేవంత్ రెడ్డి కూడా కాస్త గట్టిగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. నా స్థాయికి నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పీసీసీ పదవితో నిరూపితమైందని మహేష్ కొనియాడారు.