వడదెబ్బతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలి మృతి
24-05-2026 07:20 PM
చివ్వెంల: మండుతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలి వడదెబ్బకు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన షేక్ జానమ్మ (65) శనివారం ఉపాధి హామీ పనుల్లో పాల్గొంది. తీవ్ర ఎండల మధ్య రోజంతా పని చేసి ఇంటికి చేరుకున్న అనంతరం ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. వడదెబ్బ కారణంగానే జానమ్మ మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో మొగ్గయ్యగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






