calender_icon.png 6 October, 2024 | 7:36 PM

వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

06-10-2024 05:17:34 PM

మందమర్రి (విజయక్రాంతి) : పట్టణంలోని పలు వార్డుల్లో, మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రతిష్టించిన దుర్గామాత మండపాలలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రులు ప్రారంభమైన 4వ రోజు ఉత్సవాలలో భాగంగా ఆదివారం వివిధ మండపాలలో ప్రతిష్టించిన మండపాలలో అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా ఆయా మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని 1వ జోన్ మార్కెట్ సమీపంలోని శ్రీశ్రీశ్రీ కనక దుర్గాదేవి మండలి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో 4వ రోజు లలిత త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అడిచెర్ల శంకరమ్మ-మొండయ్య దంపతులతో పాటు, వేముల లక్ష్మి, వేముల మనీశ్వర్, దాసి పద్మ-అశోక్, చింతల రమేష్ లతో పాటు భక్తులు, కాలని వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేకే 5 గనిపై నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయంలో నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.