27-02-2025 12:05:27 AM
విద్యార్థుల ఇబ్బందులు పరిశీలన
ఎల్బీనగర్, ఫిబ్రవరి 26 : వనస్థలిపురంలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను బుధవారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ సందర్శించారు. రెండు రోజుల క్రితం హాస్టల్ విద్యార్థులు వచ్చి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వనస్థలిపురం - సుష్మ చౌరస్తాలో ఉన్న బీసీ హాస్టల్ ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు . ఫ్యాన్లు లేకపోవడం, చదువుకోవడానికి లైట్స్ లేకపోవడం, సరైన భోజనం ఇవ్వడం లేదని తెలుసుకొని చలించి పోయారు. పాతపడిన భవనం, కిటికీలు, తలుపులు సరిగా లేని కారణంగా అయిదారేండ్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను విద్యార్థులు వివరించారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ తీసుకువచ్చింది బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నారు. కానీ సంక్షేమ హాస్టల్లో అధ్వాన్న పరిస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ దృష్టికి హాస్టల్స్ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ఇప్పటికే బీసీ వెల్ఫేర్ అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. రెండు రోజుల్లో విద్యార్థులకు ఫ్యాన్లు, లైట్లు తదితర అత్యవసర వస్తువులు అందిస్తానని హామీ ఇచ్చారు.
హాస్టల్ భవన యజమానితో మాట్లాడి వెంటనే కొత్త తలుపులు, కిటికీలు, ఇతర అత్యవసర మరమ్మతులు చేయాలని సూచించారు. బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కేశురాంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాతా నాయక్, కాంగ్రెస్ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్ గౌడ్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దాము మహేందర్ యాదవ్, కొండోజు శ్రీనివాస్, అంతటి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.