26-03-2025 12:00:00 AM
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పునసమీక్షించాలి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి
కొండపాక, మార్చి 25 :ఎల్ఆర్ఎస్ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ లతో ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ అప్లోడ్, ఆన్లైన్ డేటా ఎంట్రీ, ఎఫ్ టి ఎల్, ప్రోహిబిటెడ్ ల్యాండ్ తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొహిబిటెడ్ ల్యాండ్ వివరాలు తాహసిల్దార్ ల నుంచి తీసుకొని, ఎల్ఆర్ఎస్ లొ ఫీజు జనరేట్ అయి, కట్టడానికి సిద్ధంగా ఉన్న వారు ఫీజు చెల్లించేలా చూడాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గురించి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పునః పరిశీలించుకుని ఇల్లు పూర్తి చేసుకునేలా చూడాలని సూచించారు.
అత్యంత పేదరికంలో ఉన్న వారికి జిల్లా, మండల సమైక్య లు, స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు ఇప్పించి నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. బేస్మెంట్ వరకు పూర్తయిన పనులు పనులకు, బిల్లుల వివరాలు అప్లోడ్ చేయాలని వాటికి బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ దేవకీదేవి, డిటిసిపిఓ వందనం, హౌసింగ్ పిడి దామోదర్ రావు, తదితరులు పాల్గొన్నారు.