11-03-2025 09:19:05 PM
జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భూ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని మార్చి 31 నాటికి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో టౌన్ ప్లానర్ లు, లే అవుట్ రైటర్ లు, బిల్డర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. 2020 తర్వాత కచ్చా లేఔట్ చేసిన వారు, వాటిలో ప్లాట్ లు తీసుకున్నవారు జిల్లాలో 5,488 మంది ఎల్. ఆర్.ఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేవలం 400 మంది మాత్రమే ముందుకు వచ్చి డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు.
ఇప్పటికే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ద్వారా నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఫోన్ నెంబర్లలో తేడాలు, చిరునామాల్లో తేడాలు ఉండటం వల్ల అవి ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి చేరడం లేదన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 2,112 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. లే అవుట్లు చేసిన వారు, ఓనర్లు, రైటర్ లు, బిల్డర్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సమాచారం, అవగాహన కల్పించి సకాలంలో ఎల్.ఆర్.ఎస్. చేయించుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన లేకపోవడం, సమాచారం లేకపోవడం వల్ల సద్వినియోగం చేసుకోకుంటే రేపటినాడు ఎప్పుడైనా ఎల్. ఆర్.ఎస్ ఆమోదం లేని ప్లాటుపై ఇల్లు కట్టుకోవాలంటే అప్పటి ప్లాట్ వాల్యూ పై ప్రో రేటా ఫీజు తో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.
ఎల్.ఆర్.ఎస్ ఉంటే ప్లాటుకు రక్షణ ఉంటుందని, ఎవరు అక్రమించుకోడానికి అవకాశం ఉండదని అదేవిధంగా లే అవుట్ ప్లాట్ల ప్రాంతాన్ని మున్సిపాలిటీ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ప్లాటు అమ్ముకోవాలనుకున్న ఎల్.ఆర్ ఎస్ ఉన్న ప్లాటు కు మంచి డిమాండు ఉంటుందని తెలియజేశారు. బిల్డర్లు, లే అవుట్ ప్లానర్ లు ప్లాటు యజమానులతో సంప్రదించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవిధంగా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ రిజిస్టర్ వేణుమాధవ్, కొత్తగూడెం, పాల్వంచ టౌన్ ప్లానింగ్ ఇంజినీర్ లు, బిల్డర్లు లేఔట్ ప్లానర్లు తదితరులు పాల్గొన్నారు.