22-03-2025 02:26:07 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ నిర్ణీత గడువు లోగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు.
ఎఫ్.టి.ఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్. ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి పరిశీలించుకోవచ్చని అన్నారు.
ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 31వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు. రుసుము చెల్లించిన వారి దరఖాస్తును అధికారులు పరిశీలించి వెంటదివెంట అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది తమ ప్లాట్లను, అనధికార లే ఔట్లను రాయితీతో కూడిన రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారని అన్నారు.
అనధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని కలెక్టర్ సూచించారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు. క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అర్హులైన వారందరు ఈ నెల 31వ తేదీ లోపు క్రమబద్దీకరణ చేసుకోవాలని,,ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.