03-03-2025 08:15:15 PM
25 శాతం రాయితీని పొందండి..
మార్చి 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలి..
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్..
కొత్తపేటలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో సమావేశం..
ఎల్బీనగర్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని.. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్పై జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లతో పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో సోమవారం కొత్తపేటలోని ఒక ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ... ఎల్ఆర్ఎస్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకుంటే.. 25శాతం రాయితీ పొందవచ్చని తెలిపారు.
అనుమతి లేని లేఅవుట్లలో 10శాతం రిజిస్ట్రేషన్ అయి.. మిగతా వాటిని కూడా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఎల్ఆర్ఎస్పై ఎలాంటి సందేహాలు ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ప్రాసెసింగ్, ఫీజులు, ఇతర సందేహాలను పరిష్కరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఫీజు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ ఆర్.శ్రీనివాస్ యాదవ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ముంతాజ్ బేగం, శాంసన్, ప్రతాప్, ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్, ఉప్పల్ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు.