05-03-2025 12:00:00 AM
నారాయణపేట, మార్చి 4 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో కమిషనర్ భోగిస్వర్ అధ్యక్షతన ఎల్ ఆర్ ఎస్ ఫీజు లో 25% రాయితీ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు కు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి సమస్యలు లేని వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. 2020 లో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ఫీజు ఉంటుందని, ఇది మంచి అవకాశమని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కమిషనర్ , టీపీఓ సమన్వయం చేసుకుని ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
కాగా సదస్సులో పలువురు రియల్ వ్యాపారులు తమ తమ సందేహాలను ప్రస్తావించారు. వారి సందేహాలను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ నివృత్తి చేశారు. ఈ సదస్సుకు టౌన్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు,ఎల్ టీ పీలు, డాక్యుమెంట్ రైటర్లు, ప్లాటు యజమానులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మున్సిపాలిటీలో ని ఎల్ ఆర్ ఎస్ హెల్ప్ డెస్క్ ను, కాల్ సెంటర్ ను పరిశీలించారు.