03-03-2025 01:25:37 AM
పోలీసులపై ఆరోపణలు లారీ డ్రైవర్ పరిస్థితి విషమం
ఖమ్మం / పెనుబల్లి, మార్చి 2 ( విజయక్రాంతి ): ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని విఎం బంజర ఖాకీల ఖౌర్యానికి , కొట్టిన దెబ్బలకు తాళలేక లారీ డ్రైవర్ జీవన్ కుమార్ పోలీస్ స్టేషన్ భవనం పై నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
డంకన్ డ్రైవ్ లో పట్టుబడిన లారీ డ్రైవర్ జీవన్ కుమార్ను స్టేషన్ కు తీసుకెళ్ళి విచక్షణ రహితంగా పోలీసులు కొట్టినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక వీఎం బంజర పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. పోలీసులు తీవ్రంగా కొట్టి జీవన్ కుమార్ ను గుట్టు చప్పుడు కాకుండా పోలీస్ వాహనంలో ఖమ్మం ఆసుపత్రికి తీసుకొచ్చి చేర్పించారని, అనంతరం బందువులకు ఫోన్ చేశారని అన్నారు.
జీవన్ కుమార్ కి వెన్నుపూస, పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.జీవన్ కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, పోలీసులు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు సంబంధం లేదంటున్న ఎస్ ఐ వెంకటేష్ లారీ డ్రైవర్ జీవన్ కుమార్ విపరీతంగా మద్యం సేవించి లారీ డ్రైవ్ చేశాడని, అందుకే అతనికి డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి, అదుపులోకి తీసికున్నామని పెనుబల్లి ఎస్ ఐ వెంకటేష్ స్పష్టం చేశారు. అతను పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకిన ఘటనలో పోలీసుల ప్రమేయం లేదని తెలిపారు.