లోడింగ్, అన్ లోడింగ్ వేగంగా పూర్తి చేయాలి
- ధాన్యానికి అనుగుణంగా వాహనాలను సమకూర్చాలి
- జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల, మే24(విజయక్రాంతి):జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్ లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణా భివృద్ధి శాఖ, మెప్మా, రవాణా శాఖ ..
అలాగే జన గణనపై సీపీఓ శ్రీనివాసాచారి, ఛార్జ్ అధికారులు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా మొత్తం వచ్చిన ధాన్యం ఎంత? ఇప్పటి దాకా కొనుగోలు చేసింది ఎంత? అని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్లు అందుబాటులో ఉండి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు తనిఖీ చేయాలని సూచించారు. తుది దశలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని, అక్కడి వాహనాలు, హమాలీలను మరో కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు.
అన్ని రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్ పరిశీలిస్తూ.. పూర్తి అయిన వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అధికారులకు సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాల తరలింపునకు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చేలా చూడాలని జిల్లా రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్, అపరెల్ పార్క్, గోదాములు, రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు.
జిల్లాలో జన గణన పకడ్బందీగా వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మండలాల వారీగా పురోగతి పై ఆరా తీశారు. ఛార్జ్ అధికారులు తమ పరిధిలోని సూపర్ వైజర్లు, ఎన్యూమ రేటర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించి.. వివరాలను గడువులోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.






