18-04-2025 02:40:57 PM
హైదరాబాద్: తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే.. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండతాపం తట్టుకునేందుకు ఓ వ్యక్తి కూల్ డ్రింక్ తాగుదామనుకున్నాడు. కానీ అతనికి ఇంతలోనే షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే... సాఫ్ట్ డ్రింక్ తాగుదామని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం(Sadasivapet mandal) పెద్దాపూర్లోని పట్నం హైవే రెస్టారెంట్లో ఒక కస్టమర్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్లో బల్లి(Lizard) తోకను గుర్తించాడు.
సమీపంలోని గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు భోజనం చేయడానికి రెస్టారెంట్కు వెళ్లి సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశారు. సగం తాగిన తర్వాత బాటిల్ లోపల ఏదో కనిపించడంతో, మిగిలిన కూల్ డ్రింక్ను ఒక కంటైనర్లో పోశారు. అందులో బల్లి తోక బయటపడింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ యువకులను ఆసుపత్రిలో చేర్చారు. తరువాత, శుక్రవారం ఉదయం ఈ వార్త తెలియగానే వారు ఫుడ్ ఇన్స్పెక్టర్(Food Inspector)కు ఫిర్యాదు చేశారు. వీడియో, ఛాయాచిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.