calender_icon.png 23 October, 2024 | 4:53 PM

ఓటీటీలకే పరిమితమా?

21-07-2024 12:30:00 AM

కథానాయిక సమంత కొంత కాలంగా వెండి తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ‘ఖుషి’ తర్వాత మరో సినిమాలో కనపడని ఆమె విభిన్న కథాంశాలతో ప్రయాణం చేసే ఆలోచ నలో ఉన్నారు.  ఆ తరహా కథలు ఎక్కువగా ఓటీటీ వేదికల్లో వస్తుంటాయన్నది ఉన్నమాటే. దాంతో సమంత ప్రయాణం ఆ దిశగానే సాగించనున్నట్టు తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ రెండవ భాగంతో ఈ బాటలో అడుగుపెట్టిన సమంత, ఆ ద్వయం రూపొందించిన ‘సిటాడెల్’లో నూ నటించారు.

త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుండగా, అంతలోనే ఆమె మరో వెబ్ సిరీస్ చేసేందుకు సమ్మతం తెలిపారు. ఈ సిరీస్ సైతం రాజ్, డీకే ఆధ్వర్యంలోనే రూపొందనుండటం గమనార్హం. ‘తుంబాద్’ సినిమా దర్శ కుడైన రాహి అనిల్ బార్వి తెరకెక్కించనున్న ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్‌కపూర్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషించనున్నారు.  భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు రాని ఓ సరికొత్త కథాంశంతో ఈ సిరీస్ తీయబోతున్నారట.

తీవ్రమైన భావోద్వేగాలను మిళితం చేసిన ఈ కథని తొలుత సినిమాగా తీయాలని భావించినా, తర్వాత సిరీస్‌గా తీసుకొ చ్చేందుకే మొగ్గు చూపారట దర్శక నిర్మాతలు. ‘మా ఇంటి బంగారం’ పేరిట సమంత నుంచి సినిమా ప్రకటన వచ్చినా, ఆ కథలో చలనం వచ్చినట్టు లేదు. చూస్తుంటే సమంత ఓటీటీలకే పరిమితం అవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.