- త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం
- చివరికి ఆ పార్టీలో మిగిలేది ఆ ముగ్గురే : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుందని, ఆ పార్టీలో చివరికి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర మేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హిమాయత్నగర్ డివిజన్కు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని, కేసీఆర్ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదని, ఒక వేళ దొరికినా గంలల తరబడి వెయిట్ చేయించే వారని ఆరోపించారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవా రని, అందుకే విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని, వివరాలు త్వరలో బయటపెడతానని హెచ్చరించారు.