calender_icon.png 19 October, 2024 | 6:55 PM

వెట్టిచాకిరీ జీవితాల్లో వెలుగులు

15-10-2024 12:00:00 AM

ఐరులా.. ఇదొక గిరిజన తెగ.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే తెగ. అంతా పేదలే. అక్షర ముక్కరానివారే. రోజు కష్టపడితేనే మూడు పూటల తిండి.. లేదంటే పస్తులే. పొట్టకూటీ కోసం ఏ రైస్ మిల్లులోనో, ఇటుక బట్టీల్లోనో పనిచేయాల్సిందే. అయితే అందరిలాగే కుప్పమ్మాళ్ అనే మహిళ రైస్‌మిల్లులో చేరింది. అక్కడ వేధింపులు, పనిభారం భరించలేక తనలాంటివాళ్ల హక్కుల కోసం పోరాడింది. ఎంతోమంది వెట్టిచాకిరీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది.

తమిళనాడు రాష్ట్రం తిరువల్లూర్ జిల్లా కడంబత్తూర్‌ని దైదీర్‌నగర్‌కు చెందిన కుప్పమ్మాళ్‌ది నిరు పేద కుటుంబం. ఎనిమిదో తరగతిలోనే ఇంట్లోవాళ్లు పెళ్లి చేశారు. భర్త స్థానిక రైస్ మిల్లులో కూలీ. ఆర్థిక పరిస్థితులు కారణంగా రైసు మిల్లులో పనికి కుదిర్చాడు. కుప్పమ్మాళ్ లాంటి మహిళలు ఎందరో రైస్ మిల్లులు, ఇటుక బట్టీల్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేవారు.

జైలులాంటి రైసుమిల్లుల్లో జరిగే  వేధింపులను మౌనంగా భరించింది. “మిల్లులోకి వెళ్లిన తర్వాత బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. యజమానులు మమ్మల్ని ఖైదీలుగా భావిస్తారు. కుటుంబసభ్యులకు మాతో పని చేయించుకోవడం తప్ప.. ఏమి తెలియదు.

మిల్లుల్లో ఒక పూటే తిండి పెట్టేవారు. వడ్లు ఉడకబెట్టడం, ఆరబెట్టడం, తిరిగి వాటిని సంచులకు ఎత్తడం.. రోజంతా పని నడుస్తూ నే ఉంటుంది. కనీసం పది నిమిషాలైన విశ్రాంతి తీసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదు” అని తన బాధల ను గుర్తుచేసుకుంది కుప్పమ్మాళ్

కూతురు చనిపోతున్నా.. 

ఓసారి ప్రమాదవశాత్తు మిల్లు ఆవరణలోని బావిలో కొడుకు పడి చనిపోయాడు. అయినా మిల్లు యాజమా న్యం కనికరం కూడా చూపలేదు. అయితే కుప్పమ్మాళ్‌కు వేరే ఆధారం లేకపోవడంతో మిల్లులో పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కన్న కూతురు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోతుంటే.. ఆస్పత్రిలో చేర్పించడానికి ఒప్పుకోలేదు యజమానులు.

ఈ బానిస బతుకుల నుంచి తమను వదిలేయాలని ఆమెతోపాటు భర్త సైతం యజమానిని కోరగా.. రూ.25 వేలు చెల్లించాలని మరిన్ని వేధింపుల కు గురిచేశారు. దాంతో కుప్పమ్మాళ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనలాంటివారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఎన్జీఓల సాయంతో యాజమాన్యంపై పోరాటం మొదలుపెట్టింది.

వెట్టిచాకిరీ కార్మికులను రక్షించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తమ సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కుప్పమ్మాళ్ ధైర్యం, తెగువ చూసి ఇతర మహిళలు ఆమెకు అండగా నిలిచారు. వెట్టిచాకిరీలో ఉన్నవారికి పౌరుల హక్కుల గురించి తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.

దాంతో ప్రభు త్వం స్పందించి వాళ్ల హక్కులను గుర్తించింది. కుప్పమాళ్ బాండెడ్ లేబర్ అసోసియేషన్ (ఆర్బిఎల్‌ఎ)కు నాయకత్వం వహిస్తూ వెట్టి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రస్తుతం ఎన్నో అంతర్జాతీయ వేదిక మీద కుప్పమ్మాళ్ ప్రసంగాలు చేస్తూ మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నారు. 

ప్రభుత్వ ప్రయోజనాలు

“రైస్ మిల్లులో జీవితాలు చాలా దయనీయంగా ఉంటా యి. ఇది పగలు, రాత్రి తేడా లేకుండా పని కొనసాగేది. అందుకే వెట్టిచాకిరీ కార్మికుల కోసం పోరాటం కొనసాగించా” అని అంటారామె.  కుప్పమ్మాళ్ పోరాట ఫలితంగా ప్రభుత్వాలు స్వయంగా మహిళలకు ఇటుక బట్టీలను మంజూరు చేశాయి. దాంతో ఎంతోమంది గిరిజన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. ప్రభుత్వం నిర్ణీత పనిగంటలు కల్పించడమే కాకుండా రేషన్‌కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించి బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించింది. 

 ప్రజారోగ్యంలో కీలక పాత్ర

భారతదేశంలో ప్రతి సంవత్సరం పాముకాటుకు 45,900 మంది చనిపోతున్నారు. అయితే పాము విరుగుడుకు ఉపయోగించే విషాన్ని ఈ తెగవారు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత మూడేళ్లలో పాము విషాన్ని వెలికితీసి విక్రయించడం ద్వారా దాదాపు రూ.2.36 కోట్ల లాభం చూపె ట్టారు వీరు. ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ తెగవారు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన సమా జం కోసం కృషి చేస్తుండటం విశేషం.