20-02-2025 12:00:00 AM
కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గని అధికారులకు, కార్మికులకు కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా దాదాపు ఐదు లక్షలమందికి పింఛన్ చెల్లిస్తున్నారు. అధికారులు, కార్మికులవద్ద బేసిక్నుంచి ఏడు శాతం వసూలు చేసి, యాజమాన్యాలు ఏడు శాతం కలిపి పెన్షన్ ఫండ్కు జమ చేస్తున్నారు. పదవీ విరమణ తర్వాత వారి బేసిక్, కరువు భత్యంపై ఇరవై శాతం పెన్షన్ చెల్లిస్తున్నారు.
నవంబర్ 2024 సంవత్సరం వరకు రూ.3389.53 కోట్లు పెన్షన్ ఫండ్కు వచ్చాయి. కానీ, పెన్షన్ చెల్లింపులు 3705.76 కోట్లు జరిగాయి. పెన్షన్ ఫండ్కు వచ్చిన మొత్తం కంటే 316.23 కోట్లు తక్కువ జమ కావడంతో చెల్లింపుల మధ్య ఆంతర్యం పెరుగుతుంది.
పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్, డీడీఎంఎస్ సంతోష్, సీఎంపీఎఫ్ కమిషనర్ వి.కె.మిశ్రా, కోల్ ఇండియా డైరెక్టర్ పర్సనల్ వినయ్ రంజన్ ఇతర అధికారులు, యూనియన్ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
2021 నుంచి కోల్ ఇండియా, సింగరేణి సంస్థలు టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10 పెన్షన్ ఫండ్కు జమ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన కమిటీ సమావేశంలో ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై 20 లేదా 25 రూపాయలు కోల్ ఇండియా కాంట్రిబ్యూషన్ చెల్లించేందుకు కుదిరిన అంగీకారం అమలు పరచాలి.
గతంలో జరిగిన కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో దాదాపు రూ. 1230 కోట్లు పెట్టిన పెట్టుబడులు తదనంతరం ఆ కంపెనీ దివాలా తీసింది. ఆ కంపెనీ వారికి రూ. 727 కోట్లు రైట్ ఆఫ్ ఇవ్వడంతో పెన్షన్ ఫండ్ దిగజారింది. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ వారినుంచి పెట్టుబడులను రాబట్టితే ఫండ్కు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది.
“బొగ్గు పెన్షన్ దారులకు పెన్షన్ చెల్లించే బాధ్యత బొగ్గు యజమాన్యాలదే” అని యూనియన్ నాయకులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెన్షన్ పెరగలన్నా, పెన్షన్ ఫండ్ పెరగలన్నా బొగ్గు సంస్థల లాభాల నుంచి కొద్దో గొప్పో పెన్షన్ ఫండ్కు జమ చేస్తూ, ప్రభుత్వాలు కూడా సహకరించాలి.
అప్పుడే బొగ్గు విశ్రాంత కార్మికులకు నిరంతరం పెన్షన్ కొనసాగే అవకాశం ఉంటుంది. లేకపోతే, పెన్షన్ ఫండ్ అంతరించి రిటైర్ కార్మికులు పెన్షన్ లేక ఇక్కట్లకు గురికాక తప్పదు. కనుక, ప్రభుత్వాలు, బొగ్గు సంస్థ యాజమాన్యాలు చొరవ చూపి తగిన చర్యలు చేపట్టాలి.
ఆళవందార్ వేణుమాధవ్,
హైదరాబాద్