20-03-2025 02:27:10 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ పచ్చి అబద్ధాలు, అసత్యాలతో నిండిందని, బడా జూటా బడ్జెట్ అని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. గత బడ్జెట్ను మక్కికిమక్కిగా కాఫీ కొట్టారని, అరచేతిలో వైకుంఠం తప్ప మరొకటి లేదన్నారు. అయితే గతం కంటే ఇప్పుడు బడ్జెట్ కాఫీ రెండు పేజీలు పెరిగిందన్నారు.
ఎన్నికల ముందు ఏదడిగితే అది చేస్తామన్న కాంగ్రెస్, బడ్జెట్లో మాత్రం అవేమి పట్టించుకోలేదని ఆరోపించారు. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి రూ.20 వేల కోట్లు కేటాయించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6.47 లక్షల రేషన్కార్డులు ఇస్తే.. ఒక్క కార్డు ఇవ్వలేదని చెప్పడం సరికాదన్నారు. అందాల పోటీల కోసం రూ. 2,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అదే మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
తమ హయాంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 12.4 శాతం ఉంటే, ఇప్పుడు 9.6 శాతానికి తగ్గిందని, జీఎస్డీపీ వృద్ధి రేటు కూడా 12.9 శాతం నుంచి 10.01 శాతానికి తగ్గిందని హరీశ్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్ల కోసం గత బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించి 22 పైసలు కూడా ఖర్చు చేయలేదన్నారు.