calender_icon.png 6 October, 2024 | 6:08 AM

మూసీని జీవనదిలా చేస్తాం

06-10-2024 01:05:24 AM

నది పరిసరాల్లో ఉండేవారి జీవితాలను మారుస్తాం

కొందరు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు

శంషాబాద్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

రాజేంద్రనగర్, అక్టోబర్ 5: మూసీ నదిని జీవనదిలా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని, నది పరిసరాల్లో ఉండేవారి జీవితాలను మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

కొందరు మూసీ బాధితుల ను రెచ్చగొట్టి స్వప్రయోజనం పొందేందుకు కుట్రపన్నుతున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన శంషాబాద్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శంషాబాద్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామ న్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి తగిన విధంగా వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, గతంలో మహాలక్ష్మిపథకం ప్రారంభించినప్పుడు కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. 

శంషాబాద్‌కు పంగనామాలు : ఎంపీ 

శంషాబాద్ అభివృద్ధికి జీవో 111 అడ్డంకిగా మారిందని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గత సర్కారు 111 జీవో పేరుతో జనాలకు పంగనామాలు పెట్టిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ గతంలో కేంద్ర నిధులను సరిగా వాడుకోలేదన్నారు. ఇప్పుడు తాను సహకరిస్తానని చెప్పారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మామహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, కలెక్టర్ శశాంక, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, కమిషనర్ సుమన్‌రావు, తహసీల్దార్ రవీందర్‌దత్తు, ఎంపీడీవో మున్నీ, బండ్లగూడ, నార్సింగి కమిషనర్లు శరత్‌చంద్ర, కృష్ణమోహన్‌రెడ్డి, శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

317జీవో సమస్యలపై పండుగలోపు నిర్ణయం

చేవెళ్ల: 317 జీవో సమస్యలపై పండుగలోపే ఓ నిర్ణయం తీసుకుంటామని, టీచర్లు నిర్భయంగా ఉండాలని మంత్రి  శ్రీధర్ బాబు సూచించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో వేసిన సబ్ కమిటీలో తాను కూడా ఉన్నానని, త్వరలోనే టీచర్లకు మేలు జరిగేలా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నామని చెప్పారు.

శనివారం అంతర్జాతీయ టీచర్ల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని చేవెళ్ల మండలంలోని ఓ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ టీచర్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 317 జీవోతో పాటు పీఆర్సీ, డీఏ, జూలై నెల జీతం సమా ఇతర సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని మాటిచ్చారు.

కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ వసంతం, కాంగ్రెస్ ఇన్‌చార్జి పామెన భీమ్ భరత్, పీఏసీఎస్ చైర్మన్లు ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య తదితరులు పాల్గొన్నారు.