06-04-2025 12:25:47 AM
ఎవరికీ నష్టం జరగకుండా వివాదం పరిష్కరిస్తాం
వాస్తవాలను ప్రజలకు వివరిస్తాం
కంచ గచ్చిబౌలి భూవివాదంపై ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యలు
నేడు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): హెచ్సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూవివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీతోపాటు, యూత్ కాంగ్రెస్ నాయకులతో శనివారం ఆమె సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో ఆమె చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో అన్ని అంశాలు చర్చిస్తున్నామని.. ఏకపక్షంగా కాకుండా అందరి వాదనలు విని, వివాదాన్ని పరిష్కారించాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. అందరి నుంచి అభిప్రాయా లు సేకరించిన తర్వాత గచ్చిబౌలి భూములపై ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల లేఖ లపై సమాచారం సేకరించి, ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
భూ వివాదంపై హైకమాండ్ ఫోకస్...
భూవివాదం తీవ్ర వివాదస్పదంగా మా రడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టిం ది. ఈ మేరకు రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపింది. హైకమాండ్ ఆదేశాలతో శనివారం హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ హెచ్సీయూ భూముల వివాదంపై మంత్రివర్గ కమిటీతో పాటు కాంగ్రెస్ అనుబంధ విభాగం ఎన్ఎస్యూఐ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఆదివారం ఇదే అంశంపై ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో సమావేశమై గచ్చిబౌలి భూవివాదం గురించి సుదీర్ఘంగా చర్చించనున్నారు.