calender_icon.png 24 February, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్త్‌కేర్‌లో హద్దులు చెరిపేద్దాం!

24-02-2025 12:15:45 AM

బయోఆసియా నినాదమిదే

రేపు, ఎల్లుండి హెచ్‌ఐఐసీలో నిర్వహణ పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పనే లక్ష్యం 50 దేశాలు.. మూడు వేల మంది ప్రతినిధుల హాజరు

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): దావోస్‌లో ఐటీ, ఎనర్జీ రంగా ల్లో భారీగా పెట్టుబడులను తీసుకొచ్చి మంచి జోష్ మీదున్న తెలంగాణ ప్రభు త్వం.. సొంతగడ్డపై ప్రతిష్ఠాత్మక ‘బయోఆసియా- 22వ ఎడిషన్ నిర్వహిం చేందుకు సిద్ధమైంది. హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సె స్, మెడ్‌టెక్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే టాప్‌లో నిలిపేందుకు ఈ ఈవెంట్‌ను మలుచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే హెల్త్ కేర్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వివరించనుంది.

2030 నాటికి హెల్త్‌కేర్ రంగంలో తెలంగాణ పెట్టుకున్న లక్ష్యాలను ప్రభుత్వం 22వ ఎడిషన్ వేదికగా మరోసారి వెల్లడించనుంది. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణకు  ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ను 2030 నాటికి టాప్- గ్లోబల్ లైఫ్ సెన్సైస్ హబ్‌లో ఒకటి గా నిలపడమే లక్ష్యంగా ముందుకుపోతోంది. ఈ నేపథ్యంలో బయో ఆసియా  సదస్సు లైఫ్ సెన్సైస్, హెల్త్‌కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలువనుంది. 

2030 నాటికి 250 బిలియన్ల డాలర్ల మార్కెట్..

తెలంగాణ లైఫ్ సెన్సైస్‌కు ప్రపంచ కేంద్రంగా అవతరించింది. దీని ప్రస్తుత పరిణామం 80 బిలియన్ డాలర్లు కాగా.. 2030 నాటికి దాన్ని 250 బిలియన్ డాలర్లకు చేరుకునే లక్ష్యంతో రేవంత్‌రెడ్డి సర్కారు పనిచేస్తోంది. అందులో భాగంగా రూ.1లక్ష కోట్లతో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రచించింది. రూ.2వేల కోట్లతో జీనోమ్ వ్యాలీ విస్తరణకు గతేడాదే నాంది పలికింది. అలాగే, 2030 నాటికి లైఫ్ సెన్సైస్‌లో 5లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ జరగాలంటే లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. దీనికితోడు ప్రభుత్వం తీసుకొస్తున్న ఫొర్త్ సిటీ ప్రత్యేకతను వివరించనుంది. 

రెండు రోజుల పాటు కీలక చర్చలు 

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐఐసీ)లో వరుసగా 25, 26తేదీల్లో ‘బయో ఆషియా’ సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికి దాదాపు 50 దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. ‘మార్పు సాధిద్దాం.. ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం’ అనే థీమ్‌తో ప్రభుత్వం నిర్వహిస్తోంది.  25వ తేదీన ఉదయం సీఎం రేవంత్ రెడ్డి,  క్వీన్స్‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్ యంగ్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూశ్ గోయల్, రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బయో ఏషియా ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు.  సదస్సులో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేశారు. దీనిలో స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. 

సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది.. 

బయో ఆషియా సదస్సు చరిత్రలో నిలిచిపోతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు.  సదస్సులో పాల్గొనడానికి స్టార్టప్‌ల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో ఆవిష్కరణలు, పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు బయో ఆసియా వేదిక సిద్ధంగా ఉందన్నారు. బయో ఆషియా సదస్సుకు కొత్త స్టార్టప్‌ల నుంచి అంచనాలకు మించి స్పందన వచ్చిందని  పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జయేష్ రంజన్ చెప్పారు.  ఈ ఏడాది సదస్సు ల్యాండ్ మార్క్ ఎడిషన్‌గా నిలవబోతోందని  బయో ఆషియా 2025 సీఈవో, తెలంగాణ లైఫ్ సెన్సైస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ ధీమా వ్యక్తం చేశారు.